రేపు సరూర్నగర్లోని ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో యువ సంఘర్షణ సభ నిర్వహించబోతుంది. ఈ సభ కు ముఖ్య అతిధిగా ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ప్రియాంక తొలిసారి తెలంగాణకు వస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రియాంక కేవలం గంటన్నర మాత్రమే పర్యటిస్తారని, సభలో యువ డిక్లరేషన్ ప్రకటిస్తారని ఆపార్టీ మాజీ అధికార ప్రతినిధి ఒంటెల రత్నాకర్ తెలిపారు.
ఆమె రేపు (సోమవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్ చేరుకుంటారు. అక్కడ్నించి ప్రత్యేక హెలికాప్టర్ లో సరూర్ నగర్ లోని సభాస్థలికి చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు సరూర్ నగర్ సభలో ప్రియాంక ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు సభ నుంచి ప్రియాంక గాంధీ ఢిల్లీకి బయలుదేరుతారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఆదుకోలేకపోయిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో, నిరుద్యోగభృతి ఇవ్వడంలో విఫలమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే నిరుద్యోగులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో, యూత్ డిక్లరేషన్ను ప్రియాంక గాంధీ విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు. యువ సంఘర్షణ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలి రావాలని కోరారు. ఎల్ బి నగర్, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సున్నపు వసంతం తెలిపారు.