సినీ నటి బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ జయప్రద తన మనసులోని కోరికను బయటపెట్టింది. అధిష్టానం ఆదేశించాలేగాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడి నుండి పోటీ చేయమన్నా పోటీ చేస్తానని తెలిపింది. స్వతహాగా తెలుగు మహిళను అయిన తనకు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఆ దిశగా ముందుకు సాగుతానని తెలిపింది.
సోమవారం హైదరాబాద్ హిమాయత్నగర్లోని ఓ క్లినిక్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ గెలుపునకు తనవంతు కృషి చేస్తానని ఆమె అన్నారు. ఏపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలు పాలనను గాలికి వదిలేశాయని విమర్శించారు. ముందు నీ ఇల్లు చక్కబెట్టుకుని, ఆతరువాత నీ ఊరు చక్కబెట్టుకోవాలన్నట్లు…. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించిన తర్వాతే దేశ రాజకీయాల్లోకి రావాలని ఆమె సూచించారు.