ఆంధ్రప్రదేశ్ లో యాత్రల సీజన్ వచ్చింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు బస్సు యాత్ర చేపట్టి జిల్లాల టూర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అక్టోబర్ నుండి రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టనున్నారు. గతంలో వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జగన్ బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నారని సమాచారం.
దీనిపై త్వరలోనే రోడ్ మ్యాప్ కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం. నవంబరులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని, రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే వరకు పాదయాత్రను కొనసాగించాలని లోకేష్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రమంతా తిరిగే వరకు ఎలాంటి విరామం ఇవ్వకుండా మారథాన్ పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.