ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ అభివృద్ధి పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆ వివరాలు మీకోసం…
► వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సదుపాయాలు, ఫాంగేట్ మౌలిక సదుపాయాలు, తదితర పనుల కోసం ఆర్థిక సంస్థల నుంచి రూ.1,600 కోట్ల రుణ సమీకరణకు ఆమోదం.
► మార్క్ఫెడ్లో 8 డిప్యుటీ మేనేజర్లు, 22 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు మంజూరు.
► నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎంఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో దివంగత మంత్రి గౌతం రెడ్డి పేరుతో వ్యవసాయ యూనివర్శిటీ ఏర్పాటు.
► నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ ప్లాంట్ పెట్టనున్న క్రిబ్కో. వ్యాపార కార్యకలాపాల్లో మార్పుల కారణంగా ఎరువులకు బదులు బయో ఇథనాల్ ఉత్పత్తి చేస్తామన్న క్రిబ్కోకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.
► ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో 16 అదనపు పోస్టుల మంజూరుకు ఆమోదం.
►ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ముక్తినూతలపాడులో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 3 ఎకరాలు, నెల్లూరు రూరల్ మండలం కొత్తూరులో అత్యాధునిక ఆస్పత్రికి 4 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం. రూ.100 కోట్లకు పైబడి పెట్టుబడితో పాటు 50 శాతం పడకలు ఆరోగ్య శ్రీకి కేటాయించాలనే నిబంధన. వైఎస్సార్ జిల్లా చిన్నమాచుపల్లిలో 3 ఎకరాల్లో మెడికల్ హబ్ కింద ఏర్పాటు కానున్న ఆస్పత్రికి భూమి కేటాయింపు.
► సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు, పడమటి కండ్రిగ గ్రామాల్లో 11.19 ఎకరాల భూమి టెక్స్టైల్ పార్క్కు కేటాయింపు.
► శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ డివిజన్ మడకశిర మండలం ఆర్.అనంతపురంలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏపీఐఐసీకి 235 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం. ఇదే గ్రామంలో మరో 63.16 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. మడకశిర మండలంలోని గౌడనహళ్లిలో 318.14 ఎకరాలు, ఇక్కడే మరోచోట 192.08 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, పశు సంవర్థక, మినరల్స్, టెక్స్టైల్స్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం.
► పెనుగొండలో మెగా స్పిరిట్యువల్ సెంటర్, టూరిస్ట్ బేస్ క్యాంప్నకు 40.04 ఎకరాలు ఇచ్చేందుకు అనుమతి.
► తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం గౌడమాలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసీకి 41.77 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం.
► అన్నమయ్య జిల్లా కొత్తకోట మండలం కోటవూరులో టూరిజం రిసార్ట్కు 10.50 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్.
► కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పేరవరంలో రిసార్ట్ కోసం ఏపీటీడీసీకి 56 ఎకరాలు కేటాయింపు.
► విశాఖపట్నం జిల్లా ఎండాడలో కాపు భవన్ నిర్మాణానికి అర ఎకరం స్థలం కేటాయింపునకు ఆమోదం.
► బాపట్ల జిల్లా అద్దంకిలో వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వేస్ట్ కంపోస్ట్ ప్లాంట్ నిర్మాణాలకు 19 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం.
► నంద్యాల జిల్లా ప్యాపిలిలో హార్టికల్చర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ కోసం 25.93 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం.
► బాపట్ల జిల్లాలో రేపల్లె కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు. ఆ మేరకు సవరించిన సరిహద్దులకు కేబినెట్ ఆమోదం.
► పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో నర్సపూర్ అగ్రికల్చర్ కంపెనీ లిమిటెడ్కు ఇచ్చిన 1,754.49 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్కు ఇచ్చి, ప్రస్తుతం ఆ భూమిని అనుభవిస్తున్న లీజుదారులకు ఎకరా కేవలం రూ.100 చొప్పున పూర్తి హక్కులతో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపునకు కేబినెట్ ఆమోదం. దీని వల్ల 1000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది.
► పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తూ గతంలో జారీ చేసిన జీవో సవరణకు కేబినెట్ ఆమోదం.
► జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపునకు ఆమోదం. గత ప్రభుత్వ హయాంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తూ జారీ చేసిన జీవో ప్రకారమే ప్రస్తుతం స్థలాల కేటాయింపు.