Get Latest Business, Political, Bollywood, Cricket, videos, photos, live news
Email: aptsbreakingnews@gmail.com

ఘనంగా తిరుపతి శ్రీ కోదండరాముని పుష్పయాగ మహోత్సవం:

👉 దోష నివారణకు దివ్య పుష్పయాగం :

తిరుపతి, 2026 ఏప్రిల్ 23: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించినట్లు టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకాలు చేశారు.

సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఊంజల్ మండపంలో అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం ఘనంగా జరిగింది. తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, రోజా, తామర, కలువ తదితర 12 రకాల పుష్పాలు, ఆరు రకాల ఆకులతో కలిపి మొత్తం 3 టన్నుల పుష్పాలతో స్వామివారికి యాగం నిర్వహించారు. భక్తి పరవశంలో భక్తులు ఈ దివ్యోత్సవాన్ని దర్శించారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు ఈ పుష్పాలను భక్తి భావంతో విరాళంగా సమర్పించారు. పుష్పాల సుగంధంతో ఆలయం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగం చేపట్టారు. మొదటగా అర్చకులు 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవున్ని ప్రసన్నం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారు కరుణిస్తారని నమ్మకం.

బ్రహ్మోత్సవాలు, నిత్యకైంకర్యాల్లో తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు. పుష్పయాగం అనంతరం రాత్రి 7 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్ బాబు, శ్రీ హరికృష్ణ, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RSS
Follow by Email
Latest news