సికింద్రాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీ ఎక్కడా రాజకీయ విమర్శల జోలికి వెళ్లలేదు. పైగా తెలంగాణ పై వరాల జల్లు కురిపించారు. హైదరాబాదులో అనేక ఫ్లైఓవర్లు నిర్మించామని, నగరం చుట్టూ ప్రాంతీయ రింగ్ రోడ్డు కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైతాంగానికి లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. పంటల కనీస మద్దతు ధర పెంచామని స్పష్టం చేశారు. తెలంగాణలో మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావడం తథ్యమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆవిష్కరణల పరంగా తెలంగాణ దేశానికే కేంద్రంగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో రూ.35 వేల కోట్ల నిధులతో ఐదు భారీ ప్రాజెక్టులు చేపట్టామని, తమ హయాంలో తెలంగాణలో జాతీయ రహదారులు రెండు రెట్లు పెరిగాయని వివరించారు. తమ పాలనలో గ్రామీణ యువతను ప్రోత్సహిస్తున్నామని మోడీ తెలిపారు.