ఏపీకి చెందిన ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఆలిండియా సర్వీస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించరాదు. ఒకవేళ రెండేళ్లకు మించినట్లయితే ఆ సస్పెన్షన్ ముగిసినట్టే. ఈ నిబంధన మేరకు సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
జీఏడీలో రిపోర్టు చేయాలని ఆయనకు సూచించింది. మరోవైపు ఫిబ్రవరి 8 నుంచి ఏబీవీ కి జీతభత్యాలను ఇవ్వాలని జీఏడీకి సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై సస్పెన్షన్ ను ఎత్తివేసి, వెంటనే సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయనకు చెల్లించాల్సిన జీతాన్ని కూడా చెల్లించాలని, సస్పెన్షన్ కాలాన్ని కూడా సర్వీసు కింద పరిగణించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, ఏపీ చీఫ్ సెక్రటరీ కార్యాలయానికి వెళ్లి సుప్రీంకోర్టు ఆదేశాలను ఏబీవీ అందించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తనను సర్వీసులోకి తీసుకోవాలని వినతిపత్రాన్ని ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఆయనకు సీఎస్ అందబాటులో లేడు. అయితే ఏబీవీ మరోసారి సీఎస్ కార్యాలయానికి వెళ్లారు. అప్పుడూ కూడా సీఎస్ అందుబాటులో లేకపోవడంతో ఏబీవీ మరోసారి సీఎస్ కార్యాలయంలో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ క్రమంలో ఆయనపై నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది.