దళితులు, గిరిజనులను ఆదుకోవడానికి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నామని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సమక్షంలో దళిత డిక్లరేషన్ ను రేవంత్ రెడ్డి ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కేవీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తొలుత గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఖర్గే సమక్షంలో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యకర్తలు భారీగా రావడంతో శంకరంపల్లి వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ సూచన మేరకు ఎస్సీ, ఎస్టీ డిక్లకేషన్ ప్రకటిస్తున్నట్టు చెప్పారు. సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అంశాలివే..
అంబేడ్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12లక్షలు ఇస్తాం.
కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తాం.
పోడు భూములకు పట్టాలిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ. 6లక్షలు ఇస్తాం.
రాష్ట్రంలో కొత్తగా ఐదు ఐటీడీఏలు ఏర్పాటు చేస్తాం.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాస్ అయితే రూ.10వేలు ఇస్తాం.
ప్రతి మండలంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం.
గ్రాడ్యుయేషన్, పీజీ చదివే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పిస్తాం.