తెలంగాణలో సంచలన రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. ఈ కేసులో బుధవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
ఇప్పటికే ఈ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీకి అనుమతిస్తూ… ఏసీబీ కోర్టు ఇదేరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టును కోరారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.