పదో తరగతి హిందీ పేపర్ లీకేజి వ్యవహారంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటల ఈ రోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ గంటపాటు విచారించారు. విచారణ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ… 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి ఆడుకుంటూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
కుట్రపూరితంగానే తనపై నేరం మోపే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ డైరెక్షన్ లోనే తనపైనా, బండి సంజయ్ పైనా పోలీసులు కేసులు నమోదు చేశారని అన్నారు. 22 ఏళ్లుగా తాను ప్రజా జీవితంలో ఉన్నానని, ఎంతో బాధ్యతతో ఉన్నానని చెప్పారు. అలాంటి తనపై పేపర్ లీక్ కేసు పెట్టారని విమర్శించారు. దీన్ని పేపర్ లీక్ అనరని, మాల్ ప్రాక్టీస్ అంటారని చెప్పారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశం నుంచి జనాల దృష్టిని మళ్లించేందుకే పదో తరగతి పేపర్ లీక్ అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. చట్టం, పోలీసు వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉందని చెప్పారు.