హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతించనున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించారు. లెబనాన్తో ఇజ్రాయెల్ 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఇరాన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు హర్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి తెరిచినందుకు ఇరాన్కు ధన్యవాదాలు తెలిపారు.
ఇరాన్ ప్రకటనతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 8 శాతం మేర క్షీణించి 90 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ మే నెల కాంట్రాక్ట్ 9.8 శాతం క్షీణించి బ్యారెల్ ధర 85 డాలర్లకు చేరువైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవల కాలంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 100 డాలర్లు పైనే ట్రేడవుతూ వచ్చింది. క్రూడాయిల్ తగ్గుముఖం పట్టడం వల్ల దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు మేలు చేకూరుతుంది.











