పట్టన ప్రగతిలో భాగంగా… జగిత్యాల లో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఎంతో మంది వీధి వ్యాపారస్తులు రోడ్డున పడ్డారని జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నాయకురాలు డాక్టర్ భోగ శ్రావణి ఆరోపించారు. అలంటి వారిని తక్షణమే ఆదుకోవాల్సిన భాద్యత రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులకు ఉందన్నారు. ఈమేరకు గురువారం రోజున ఆమె జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం శ్రావణి మాట్లాడుతూ… నగరంలో ఎంతో మంది ప్రజలు వీధి వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. వీధి వ్యాపారాలను క్రమబద్దీకరిస్తూ…షెడ్ లు కేటాయించి వారిని ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
పట్టణంలోని పాత బస్టాండ్ నుండి గొల్లపల్లి రోడ్డు మార్గంలో 37 షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ఆమె వివరించారు. వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు వాటిని వ్యాపారులకు కేటాయించలేదని, ఇకనైనా వాటిని తక్షణమే కేటాయించాలని కలెక్టర్ ను కోరడం జరిగిందని అన్నారు. అలాగే పట్టణ ప్రగతి, మెప్మా నిధుల ద్వారా నిర్మాణం చేపట్టవలసిన మిగితా 23 షెడ్లను త్వరితగతిన పూర్తి చేసి విధి వ్యాపారులకు చేయూతను అందించాలని కలెక్టర్ ను కోరినట్లు శ్రావణి తెలిపారు.