తెలంగాణను 7,200 మంది దొంగలు పట్టి పీడిస్తున్నారని చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్ర సంపదను 7,200 మంది కొల్లగొడుతున్నారని, ఆ వెలమ దొరల భరతం పడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మల్లన్న టీమ్ 7200 పేరుతో తాను ఉద్యమం చేస్తున్నానని, అందుకే త్వరలో రాజకీయ పార్టీని పెడుతున్నట్టు అయన ప్రకటించారు. తనపై, తన కుటుంబంపై ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చి, రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. ఆస్తులను త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇంతవరకు ఎవరూ లేరని చెప్పారు. తాను ఏర్పాటు చేసిన టీమ్ ఇప్పటి వరకు 176 మంది చిన్నారులకు గుండె చికిత్సలు చేయించిందని అన్నారు. బీజేపీ కన్నా తమ టీమ్ లక్ష రెట్లు మేలని అయన అన్నారు. జీవితంలో తాను బీజేపీ కార్యాలయం గడప తొక్కనని శపథం చేశారు.
