మరో రెండు వారాలపాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ప్రకటించిన కొన్ని గంటలకే, ఇరాన్ లోని లావన్ ద్వీపంలోగల ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగినట్లు ఇరాన్ తెలిపింది. ఇది ఒక పిరికిపంద చర్యగా ఇరాన్ అభివర్ణించింది. మా చమురు శుద్ధి కేంద్రాన్ని శత్రువులు లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. టెహ్రాన్ కూడా ప్రతి దాడులు నిర్వహించింది. యూఏఐ, కువైట్లపై క్షిపణి, డ్రోన్ లతో దాడులు చేసింది.
నేషనల్ ఇరానియన్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (ఎన్ఐఓఆర్డీసీ) కంపెనీ లావన్పై దాడిని ధృవీకరించింది. ఈ దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. చెలరేగిన మంటలను అదుపు చేయడానికి వెంటనే భద్రతా మరియు అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయిలోని సిబ్బందిని సకాలంలో తరలించడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఎన్ఐఓఆర్డీసీ తెలిపింది.
ఇరాన్ జాతీయ ఇంధన సరఫరా మరియు పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేదని ఎన్ఐఓఆర్డీసీ స్పష్టం చేసింది. అయితే పౌరులు ఇంధన వినియోగాన్ని నియంత్రించుకోవాలని, అనవసర ప్రయాణాలను నివారించాలని, వీలైనంత వరకు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని కోరింది.











