ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు కేంద్ర సర్కార్ కుట్ర చేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తెలంగాణలో కరోనా తర్వాత 2021–22 లో 14 కోట్ల పని దినాలు ఉంటే.. గతేడాది 7 కోట్లకు పని దినాలను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి పని దినాలు తగ్గించటం, నిధులు ఇవ్వకపోవటంపై కేంద్ర సర్కార్ను ప్రశ్నిస్తూ మంగళవారం ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఈ పథకానికి చట్టబద్ధత కల్పిస్తే నిధులు తప్పనిసరి ఇవ్వాల్సివస్తుందని, అందుకే ఈ పథకాన్ని ఒక ప్రోగ్రామ్ గా మార్చేసి నిధులు ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. వారు ప్రజల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పేదల నోటికాడి కూడు కొల్లగొడుతుంటే బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం అన్యాయమన్నారు. ఉపాధి హామీలో పని దినాలు కల్పించే ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారన్నారని ఆమె విమర్శించారు. వారికి ఉద్యోగ భద్రతతో పాటు, కార్మిక చట్టాలను అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.











