అమెరికా సైన్యంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్ను తక్షణమే పదవి నుంచి వైదొలగాలని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఆదేశించారు. ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాల్లో పనిచేసిన అనుభవజ్ఞుడైన జార్జ్ను తొలగించడం అమెరికాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇరాన్తో అమెరికా యుద్ధం కొనసాగుతున్న ఈ తరుణంలో ఆర్మీ అత్యున్నత అధికారిపై వేటు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే, జార్జ్ను అర్ధాంతరంగా తొలగించడానికి గల కచ్చితమైన కారణాలను పెంటగాన్ వెల్లడించలేదు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ఆలోచనా విధానాలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వం సైన్యంలో ఉండాలని హెగ్సెత్ భావిస్తున్నారని, అందుకే ఈ మార్పులు చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. జనరల్ జార్జ్ వెంటనే పదవీ విరమణ చేస్తున్నారని పెంటగాన్ అధికారికంగా ధ్రువీకరించింది.
సాధారణంగా ఈ పదవీలో అయన నాలుగు సంవత్సరాలు కొనసాగాలి, కానీ కేవలం 18 నెలలకే ఆయనను పదవినుంచి తొలగించడం చర్చినీయాంశంగా మారింది. 2023లో జార్జ్ ఈ బాధ్యతలు చేపట్టారు. జార్జ్ స్థానంలో ఆర్మీ వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ క్రిస్టోఫర్ లానేవ్ యాక్టింగ్ చీఫ్గా వ్యవహరించనున్నారు. గతేడాది హెగ్సెత్ రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన 12 మందికి పైగా ఉన్నతాధికారులను పదవుల నుంచి తప్పించారు. తాజాగా కూడా సైన్యంలో ఉన్నతస్థాయి అధికారుల తొలగింపు పరంపర కొనసాగుతోంది.











