హనుమాన్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో భారీ ‘విజయయాత్ర’, ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు గౌలిగూడ రామాలయం నుంచి ఈ విజయయాత్ర ప్రారంభమై పుత్లిబౌలి, నారాయణగూడ, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్రోడ్స్, అశోక్నగర్, కవాడిగూడ, ప్యారడైజ్ మీదుగా రాత్రి 8 గంటలకు తాడ్బండ్లోని హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. నేపథ్యంలో నగర పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శాంతిభద్రతల దృష్ట్యా మూడు కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఈ ర్యాలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధించారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ప్రధాన యాత్రలో నగరం నలుమూలల నుంచి సుమారు 14 ఉప యాత్రలు వచ్చి కలవనున్నాయి. ర్యాలీ సాగే మార్గాన్ని పోలీసులు సీసీటీవీల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

ఈ యాత్ర జరిగే మార్గాల్లో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నట్లు జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్ తెలిపారు. లక్డీకాపూల్ నుంచి దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వాహనాలను బషీర్బాగ్ వైపు, దిల్సుఖ్నగర్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే వాటిని ఎల్బీనగర్ మీదుగా పంపనున్నారు.











