ఇరాన్ లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్ నగరం పై అమెరికా భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై 2వేల పౌండ్ల బంకర్ బస్టర్ల తో దాడి చేసింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ‘వాల్స్ట్రీట్ జర్నల్’ ఈ విషయాన్ని పేర్కొంది. మరోవైపు.. తమతో ఒప్పందం కుదుర్చుకోకపోతే.. ఆ దేశంలో భారీ విధ్వంసాన్ని సృష్టిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ దాడికి సంబంధించిన వీడియోను ట్రూత్ సోషల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్టు చేశారు. కానీ ఈ దాడికి సంబంధించి ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
అయితే, ఆయుధ నిల్వలు ఉన్న ఓ డిపోపై అమెరికా- ఇజ్రాయెల్ ఈ దాడులు చేశాయని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. దాడుల నేపథ్యంలో ఈ ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకోగా.. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీనిపై ఇరాన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా.. ఇరాన్ సుమారు 540 కిలోల యురేనియం నిల్వలను ఇస్ఫహాన్లో ఓ భూగర్భ కేంద్రానికి తరలించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ భారీఎత్తున దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నేపథ్యంలో.. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు అమెరికాకు చెందిన MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు సమాచారం. ఈ విషయాన్ని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఎగురుతున్న MQ-9 రీపర్ డ్రోన్ను ధ్వంసం చేశామని ఐఆర్జీసీ వర్గాలు పేర్కొన్నాయి.











