భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్గా అవతరించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఏపీ తెలంగాణ లో మరిన్ని ఎయిర్ పోర్ట్ లను నిర్మించనున్నట్లు అయన తెలిపారు. ముఖ్యంగా సామాన్యుడికి కూడా విమాన ప్రయాణాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో విమానయాన రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి.
దేశీయ విమానయాన రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులను అయన వివరించారు. గత కొన్నేళ్లలో మం దేశంలో విమానాశ్రయాల సంఖ్య అసాధారణంగా పెరిగిందని అన్నారు. ‘ఉడాన్’ (UDAN) పథకం ద్వారా టైర్-2, టైర్-3 నగరాలకు కూడా విమాన సర్వీసులు విస్తరించాయి. దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ప్రయాణ సౌకర్యం లభిస్తోందని మంత్రి వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం మన దేశంలో విమానాశ్రయాల సంఖ్య మొత్తం 167కు చేరుకుందన్నారు. ప్రతి 45 రోజులకు ఒక కొత్త విమానాశ్రయాన్ని దేశంలో ప్రారంభిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ లో…
తెలంగాణలో వరంగల్ (మామునూరు), నిజామాబాద్ (జక్రాన్పల్లి), ఆదిలాబాద్లలో పాత విమానశ్రయాలను పునరుద్ధరించి, పౌర విమానయానానికి సిద్ధం చేసేందుకు చర్చలు తీసుకుంటున్నట్లు అయన వివరించారు. వీటితో పాటు కొత్తగూడెంలో కూడా కొత్త ఎయిర్ పోర్ట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు అయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో..
విశాఖపట్నంపై ఉన్న ఒత్తిడిని తగ్గించి, అంతర్జాతీయ కనెక్టివిటీని పెంచే దిశగా విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా దగదర్తితో పాటు, కుప్పంలో కూడా కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి మరిన్ని నగరాలకు సర్వీసులను పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఉపాధి అవకాశాలు..
భారత్లోనే విమానాల తయారీ జరిగితే డొమెస్టిక్ సర్వీసుల ఛార్జీలు మరింత తగ్గే అవకాశం ఉందని అయన అన్నారు. దీనివల్ల విదేశీ కంపెనీలపై ఆధారపడటం తగ్గి, దేశీయంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విమాన ప్రయాణం విలాసం కాదు, అది ఒక అవసరమని భావిస్తూ మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి తెలిపారు.











