1979 ఇరాన్ విప్లవం వారసత్వ, రాజరిక పాలనను అంతం చేసింది. అయితే, ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ గా మోజ్తబా ఖమేనీ నియామకం రక్త సంబంధానికి ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇది విప్లవ సిద్ధాంతాలకు విరుద్ధమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సైన్యం (IRGC) ఒత్తిడితోనే అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈ నిర్ణయం తీసుకుందని అంతర్జాతీయ నిఘా వర్గాలు, పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాన్ రాజకీయాల్లో ఒక అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడిగా మోజ్తబా ఖమేనీ (56) బాధ్యతలు చేపట్టారు. గత కొన్నేళ్లుగా మోజ్తబా తన తండ్రి, మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి, బయటి ప్రపంచానికి మధ్య ఒక ‘గేట్ కీపర్’గా వ్యవహరించారు. కీలక నియామకాలు, విదేశాంగ విధానాలు, నిఘా సంస్థల కార్యకలాపాల్లో తెర వెనుక నుంచి చక్రం తిప్పారు. ఈ కారణంగానే అమెరికా దౌత్యవేత్తలు ఆయన్ను ‘తెర వెనుక పాలకుడు’ అని అభివర్ణించారు.
ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేయని, బహిరంగంగా పెద్దగా కనిపించని ఆయన.. ఏకంగా దేశ సర్వాధికారిగా మారడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీని వెనుక నాలుగు దశాబ్దాల పక్కా వ్యూహం ఉన్నట్లు స్పష్టమవుతోంది. 1986లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో మోజ్తబా ఎదుగుదలకు బీజం పడింది.
అప్పుడు అయన వయస్సు 17 ఏళ్ళు, ఆ చిన్న వయస్సులోనే ఒక సాధారణ వాలంటీర్గా ‘హబీబ్ బెటాలియన్’లో చేరారు. ఇరాన్ సైన్యం (IRGC)లో అత్యంత శక్తిమంతంగా ఎదిగిన హొస్సేన్ తాయెబ్, హొస్సేన్ నెజాత్ వంటి కమాండర్లతో అక్కడే బలమైన సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ సైనిక నెట్వర్కే ఆయనను అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది.
అయితే దేశంలో ప్రస్తుత పెరిస్థితుల దృష్ట్యా అయన దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళతారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం అంతర్గత నిరసనలు, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఇరాన్ను తన సైనిక నేపథ్యంతో నూతన సుప్రీం మోజ్తబా ఎలా నడిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.











