తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్య క్రమాలపై సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ నూతన పంచాయతీ రాజ్ చట్టం తెచ్చినప్పుడు పలువురు అనుమానాలను వ్యక్తం చేశారు.
కానీ నేడు వారి అనుమానాలను పటాపంచలు చేసి తెలంగాణ పల్లెలను అభివృద్ధి పధంలో నడిపించుకుంటున్నామని అన్నారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతులు ఏర్పాటు చేసుకొని పల్లె ప్రగతి సాధిస్తున్నాం అని వివరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిని కొన్ని జాతీయ మీడియా చానెల్స్ సైతం ప్రసారం చేశాయని గుర్తు చేశారు.
మనము చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండవ దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం మన పనితనానికి నిదర్శనం అన్నారు. ఈ దిశగా కృషి చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీ రాజ్ శాఖను సీఎం అభినందించారు.