సిఎం కేసీఆర్ పాలనకు చమరగీతం పడటమే తమ లక్ష్యం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ‘ప్రజాసంగ్రామ యాత్ర’ ప్రారంభ సభలో ఈటల మాట్లాడారు. కేసీఆర్ కు ఢిల్లీ చక్రం తిప్పడం కాదు, ఇక్కడ ఉన్న ఉద్యోగం కూడా ఊడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోడీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని.. అదే సమయంలో సీఎం కేసీఆర్ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదని విమర్శలు గుప్పించారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కేసీఆర్ ఎంత మాత్రం ప్రయత్నించరని, ఎన్నడు సచివాలయానికి రారని, ఉంటే ప్రగతి భవన్ లో, లేకుంటే ఫామ్ హౌస్ లో ఉంటారని అయన అన్నారు.
కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం జరగడం లేదని, టీఆర్ఎస్ సర్కారులో ఉన్న సగం మంది మంత్రులు తెలంగాణ రాష్ట్రాన్ని వద్దన్న వారేనని ఈటల వ్యాఖ్యానించారు. తెలంగాణలో టీఆర్ఎస్ రాజ్యాంగమే నడవాలన్నట్టుగా వైఖరి ఉందని.. కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో వరదలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు దళితుల అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు బుద్ధి చెప్పే అవకాశం త్వరలోనే వస్తుందని, కేసీఆర్ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.