రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన విభజన చట్టంలోని హామీల సాధనకు కలిసొచ్చే రాజకీయ పక్షాలతో కలిసి ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకొంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లా, మండల, పట్టణ కార్యాలయాలో జాతీయ జెండా ఎగురవేసి ప్రతిజ్ఞ చేయాలని అయన పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరగబోతున్నదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీగా సీపీఐ మొట్ట మొదటగా తీర్మానించిందన్నారు. ఉద్యమ కార్యాచరణను అనేక పద్ధతుల్లో రూపొందించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక ఆందోళనలు నిర్వహించిందన్నారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏళ్లైనా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నదన్న చందంగా ఉందని విమర్శించారు.
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల వివక్షతో, రాజకీయ సంకుచిత ఆలోచనలతో కేంద్రం ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. దాదాపు 1800 మంది అమరులు రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఆ అమరుల ఆశయాలను నేరవేర్చాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వాలపై ఉన్నదని పేర్కొన్నారు.