గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. పాకిస్థాన్ సరిహద్దులోని సాంబా జిల్లాలో రూ.20వేల కోట్లతో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 8.45 కిలోమీటర్ల పొడవున రూ.3,100 కోట్లతో నిర్మించిన బనిహాల్–ఖాజీగంద్ రోడ్డు సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. ఢిల్లీ-అమృత్ సర్-కాత్రా ఎక్స్ ప్రెస్ వేకు ఆయన శంకుస్థాపన చేశారు. పల్లీ గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్, చినాబ్ నదిపై 850 మెగావాట్ల రాటిల్ జలవిద్యుత్ కేంద్రం, 540 మెగావాట్ల క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఏళ్ల తరబడి రిజర్వేషన్ పొందని వారు ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇప్పుడు రిజర్వేషన్ ప్రయోజనం పొందుతున్నారని ప్రధాని వివరించారు. త్వరలో జమ్మూ కాశ్మీర్ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ దినోత్సవం నాడు ఇక్కడ పర్యటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.