పాటకు ప్రాణం పోయడం ఎలా..? పాటల ద్వారా అందించాల్సింది వినోదం మాత్రమేనా? విజ్ఞానం అవసరం కూడా ఉందా? ఇలాంటి సందేహాలతో సతమతమవుతున్న అందరిని ఒకేచోట చేర్చి ఓ అవగాహన కలిగిస్తే..? ఎలా ఉంటుందనే ఆలోచనతో ‘తెలంగాణ సాహితి’ ముందుకు వచ్చింది. దాని ఫలితంగానే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ‘పాటకు జేజేలు’ పేరుతో నవంబర్ 20,21,22వ తేదీల్లో హైదరాబాదులోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన భవనంలో తెలంగాణ సాహితి వారిచే లిటరరీ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాగ్గేయకారులతో పాటు నవ యువ రచయితలు గాయకులు పాల్గొంటారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాటకు పట్టం కడుతూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖుల సందేశాలు, సినీ గీతాల సాహిత్య విశ్లేషణ వ్యాస సంకలనం విడుదల, పరిశోధక పత్రాల సమర్పణ, సినీ వాగ్గేయకారుల పరిచయం మరియు సన్మానాలు ఉంటాయి. చివరి రోజున కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని తెలంగాణ సాహితి రాష్ట్ర కమిటీ, నగర కమిటీ కోరుతున్నారు.