ఉమ్మడి ఏపీ లోని ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ లోని ఏడూ మండలాలను కొత్తగా ఏర్పడిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, తాము తెలంగాణలోనే ఉంటామని అప్పట్లో ఆయా మండలాల ప్రజలు ఆందోళనలు సైతం చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయా ప్రాంతాల్లోని కొందరు ప్రజలు తమ పెట్టాబేడా సర్దుకుని తెలంగాణకు వస్తున్న పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఇళ్లను అద్దెకు తీసుకుని ఇక్కడకు తరలి వస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి ఉప్పొంగడంతో ఆ విలీన మండలాల ప్రజలు ఇటీవల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆగష్టు నెలలో మళ్ళీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో మరోమారు వరద వస్తుందన్న భయంతో.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వరరామచంద్రపురం, కూనవరం మండలం లోని కొందరు ప్రజలు తెలంగాణకు తరలి వస్తున్నారు. ముందు జాగ్రత్తగా డీసీఎంలలో సామన్లు తీసుకుని తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి తరలి వస్తున్నారు. వరదల కారణంగా తాము ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.