తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఇల్లు, కార్యాలయాలపై అధికారులు సోదాలు జరిపారు. బుధవారం ఉదయం నుంచి మొదలైన ఈ సోదాలు రాత్రి దాకా కొనసాగాయి. సోదాల సందర్భంగా గంగుల ఇంటి నుంచి పలు పత్రాలను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలంటూ ఆదాయపన్ను, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం సోదాలు జరిపారు.
ఈ సోదాల సమయంలో గంగుల కమలాకర్ఇంటిలో లేరు. ఇటీవలే కుటుంబంతో కలిసి దుబాయి పర్యటనకు వెళ్లారు. ఐటీ, ఈడీ అధికారులు తన ఇంటిపై దాడులు చేసిన విషయాన్ని తెలుసుకున్న ఆయన దుబాయి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రికి కరీంనగర్ చేరిన గంగుల ఐటీ, ఈడీ అధికారుల దాడులపై స్పందించారు. తాను గత 30 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నానని అన్నారు. తాను ఏనాడూ నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు.
తనపైనా, తన వ్యాపారాల పైనా కొందరు దురుద్దేశంగా ఐటీ, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తు సంస్థలకు తాను పూర్తీ స్థాయిలో సహకరిస్తానని స్పష్టం చేశారు. అందుకోసమే తాను దుబాయి నుంచి తిరిగి వచ్చానని తెలిపారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే రాష్ట్రంలో ఐటీ, ఈడీ ఇలాంటి దాడులు జరుగుతున్నాయని గంగుల ఆరోపించారు.