సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో మూడు వన్డేల సిరీస్ను భారత్ అండర్ – 19 జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేసింది. బుధవారం జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 233 పరుగుల భారీ విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది. ఓపెనర్లు వైభవ్, ఆరోన్ తొలి వికెట్కు 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (127; 74 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్లు) మరోసారి సెంచరీ సాధించగా, ఆరోన్ జార్జి (118; 106 బంతుల్లో 16 ఫోర్లు) కూడా సెంచరీ తో కదం తొక్కాడు.
కొండంత లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. టాప్-4 బ్యాటర్లలో ఒక్కరూ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. పాల్ జేమ్స్ (41), డేనియల్ బోస్మాన్ (40), కార్న్ బోథా (36*) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో కిషాన్ కుమార్ సింగ్ 3, మహ్మద్ ఎనాన్ 2, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, ఉదవ్ మోహన్, ఆర్.ఎస్.అంబరీష్, వైభవ్ సూర్యవంశీ తలో వికెట్ పడగొట్టారు.
భారత బ్యాటర్లలో వైభవ్, అరోన్ సెంచరీలతో విరుచుకుపడగా.. వేదాంత్ త్రివేది (34; 43 బంతుల్లో), మహ్మద్ ఎషాన్ (28*), హెనిల్ పటేల్ (19*), అభిజ్ఞాన్ కుందు (21) పరుగులు చేశారు. తాజా సెంచరీతో వైభవ్ ఓ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆయుష్ మాత్రే గైర్హాజరీలో తొలిసారి సారథ్య బాధ్యతలు అందుకున్న ఈ కుర్రాడు.. యూత్ వన్డే క్రికెట్లో సెంచరీ చేసిన అతి పిన్నవయస్కుడైన అండర్-19 కెప్టెన్గా ఘనత సాధించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఈ ఫీట్ అందుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును వైభవ్ సూర్యవంశీ గెలుచుకున్నాడు.











