ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న క్రమంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ఎయిర్ఫోర్సుకు సంబందించిన ఇంధనం నింపే విమానం KC-135 Tanker కుప్పకూలింది. పశ్చిమ ఇరాక్లో ఈ ఘటన చోటుచేసుకుందని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సైన్యం తెలిపింది. ఇరాన్తో యుద్ధం ప్రారంభించిన తర్వాత పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన విమానాలు కూలిపోవడం ఇది నాలుగోసారి.
అయితే ఈ విమానాన్ని తామే కూల్చామని ఇరాక్లో ఇరాన్ మద్దతున్న రెసిస్టెన్స్ గ్రూప్ ప్రకటించింది. పశ్చిమ ఇరాక్లో అమెరికా మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ని క్షిపణితో కూల్చివేశామని వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఈ వార్తలను అమెరికా కొట్టివేసింది. అది ప్రమాదవశాత్తు కూలిపోయిందని చెప్పింది.
కేసీ-135 విమానం గత 60 ఏండ్లుగా సేవలు అందిస్తున్నది. సాధారణంగా అందులో ముగ్గురు సిబ్బంది ఉంటరు. ఇద్దరు పైలట్లు, మరొకరు మరో విమానానికి ఇంధనం నింపేందుకు ఉపయోగించే పరికరాలను నిర్వహిస్తుంటారు. అయితే కొన్ని కే-135 విమానాల్లో ఒక న్యావిగేటర్తోపాటు 37 మంది వరకు ప్రయాణించవచ్చని ఎయిర్ ఫోర్స్ ఫ్యాక్ట్షీట్ వెల్లడించింది.
ఫిబ్రవరి 28న ఇరాన్తో యుద్ధం ప్రారంభమైననాటినుండి ఇప్పటివరకు మూడు విమానాలను అమెరికా కోల్పోయింది. మూడు ఎఫ్-15ఈ యుద్ధవిమానాలు కువైట్ సైన్యం పొరపాటున జరిపిన కాల్పుల్లో కూలిపోయాయి. తాజాగా మరొకటి కూలిపోవడం గమనార్హం.











