శ్రీరామనవమి పర్వదినం రోజున భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరామనవమి నాడు పాలకులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం గోల్కొండ నవాబుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ.
ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తన అర్ధాంగితో కలిసి స్వామివారికి వస్త్రాలు అందజేశారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక, భద్రాద్రి రాముడిపై తన భక్తిని చాటుకుంటూ ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
భద్రాచలం ఆలయాన్ని మూడు దశల్లో విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొత్తం రూ.586 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తొలి దశలో రూ.351 కోట్లతో చేపట్టనున్న పనులకు ముఖ్యమంత్రి శ్రీరామనవమి రోజునే భూమిపూజ చేసి శ్రీకారం చుట్టారు.











