నూతన సంవత్సర కానుకగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ఇవ్వనున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు . గత ప్రభుత్వంలో నాటి సీఎం ఫోటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారు .
నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజలు అసంతృప్తి గా ఉన్న నేపథ్యంలో… రీ సర్వే చేసి, తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని, ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే . ఈ క్రమంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది .
జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టింది . ఇప్పటికే రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసుపుస్తకాల పంపిణీ చేయనున్నారు . నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేశారు . జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న పాసుపుస్తకాలు పంపిణీ చేశారు . ఈ ఘటనపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఈ సందర్భంగా మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేరుస్తోందని అన్నారు . భూమే ప్రాణంగా బతికే రైతులకు భూ సమస్యలు లేకుండా చేయడం మన లక్ష్యం అని చెప్పారు .
గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని బాబు ఆరోపించారు . నిర్థిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని, మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ఎక్కువ చొరవ తీసుకోవాలని బాబు సూచించారు . పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంపై మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్పరెన్స్ నిర్వహించారు . పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో నేను కూడా ఒకరోజు పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు .











