అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ నాగరికతను నేటి రాత్రితో అంతం చేసి రాతియుగంలోకి నెట్టివేస్తామని అన్నారు. ఆ దేశాన్ని మళ్లీ ఎప్పటికీ పునరుద్ధరించలేరని ‘ట్రూత్ సోషల్’ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఇరాన్లో 47 ఏళ్లుగా ఉన్న అవినీతి, అరాచక పాలన అంతం చేయనున్నామని, ప్రపంచ చరిత్రలో ఈ రాత్రి ఓ మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆ దేశాన్ని తుడిచిపెట్టడం నిజానికి తనకు ఇష్టం లేదని.. కానీ ఆ విధంగా చేయక తప్పట్లేదని పేర్కొన్నారు. ఇరాన్లోని పౌర, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే.. అంతర్జాతీయ నేరంగా పరిగణిస్తామని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించినప్పటికీ అమెరికా దాడులు కొనసాగిస్తోంది.
మరికొన్ని గంటల్లో ఇరాన్ ప్రభుత్వం హర్మూజ్జల సంధిని తెరవకపోతే, ఆ దేశంలోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అమెరికా ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. దాంతో తాజాగా మరోసారి ట్రంప్ చ్చరికలు చేశారు. అయితే, ఇరాన్లో తెలివైన కొత్త నాయకత్వం వచ్చిందని, దాని వల్ల అద్భుతాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు.
ఈ రాత్రికి ఇరాన్ నాగరికత తుడిచి పెట్టుకోబోతోందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. అమెరికా, దాని మిత్రదేశాలకు ఇరాన్ దెబ్బ ఏంటో . .. దాని రుచి ఎలాఉంటుందో చూపిస్తామని పేర్కొంది. ఈ మేరకు దక్షిణ ఆఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. అయితే, అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు తాజాగా ఇరాన్లోని పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తున్నాయి. మెరైన్లతో ఆపరేషన్ చేపట్టి ఇరాన్లోని ఖర్గ్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకోవడానికి అగ్రరాజ్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఐలాండ్ లో ఉన్న దాదాపు 50 టార్గెట్ ప్రాంతాలపై తమ దళాలు దాడులు జరిపినట్లు పెంటగాన్ వెల్లడించింది. అలాగే అక్కడి రక్షణ వ్యవస్థలపై కూడా దాడులు చేసినట్లు అమెరికా తెలిపింది.











