బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ కి రోజుకు కొన్ని వేల మంది వస్తున్నారు. ఈక్రమంలో నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో రోడ్డు వెడల్పుతో చాలా మంది మెయిన్ రోడ్డుపై ఇల్లులు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాగపూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
నగరంలోని అన్ని ప్రాంతాల్లో వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంలేదు. ప్రధానంగా ఎల్బీనగర్-హయత్ నగర్ మధ్య 65కి పైగా కాలనీల్లో సుమారు 10-12 లక్షల జనాభా నివసిస్తోందని, వాహనాల రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విజయవాడ హైవే ఉండటంతో ప్రధానంగా ఇక్కడ నిత్యం రద్దీతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు నాగ్పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో మట్టి రోడ్లు లేకుండా అన్నింటినీ బీటీ రోడ్లుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ను నిర్మించనున్నట్లు అయన వివరించారు. దీనివల్ల హైదరాబాద్-విజయవాడ ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర ప్రభుత్వం రూ.741 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లు భరిస్తాయని మంత్రి తెలిపారు. ఆరు నెలల్లో టెండర్లు ఖరారు చేసి, పనులు మొదలయ్యేలా చూస్తామని అయన హామీ ఇచ్చారు.
మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. రూ.941 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు నెల రోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం తీసుకుంటామని స్పష్టం చేశారు. తొలి దశలో రూ.13 వేల కోట్లతో 6,092 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్ (హ్యామ్) పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తి కానుందని, మే నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అయన వివరించారు.











