భారత్దిశగా వస్తోన్న నౌకపై దాడి జరిగింది. దాంతో ముగ్గురు గల్లంతయ్యారు. థాయ్ జెండాతో ఆ కార్గో నౌక యూఏఈలోని పోర్టు నుంచి బయల్దేరి.. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ దాడి జరిగిందని రాయల్ థాయ్ నేవీ వెల్లడించింది. ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు ఏ గ్రూప్ బాధ్యత ప్రకటించుకోలేదు. అయితే ఈ దాడి ఇరాన్ చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఈ నౌక థాయ్లాండ్లోని షిప్పింగ్ కంపెనీకి చెందిన మయూరీ నారీ అనే కార్గో షిప్. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ఖలిఫా పోర్ట్ నుంచి గుజరాత్లోని కాండ్లా పోర్ట్కు వస్తున్నక్రమంలో… హర్మూజ్ మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు దాడికి గురైంది. దాంతో నౌక నుంచి దట్టమైన పొగ వెలువడుతోన్న ఫోటోలను రాయల్ థాయ్ నేవీ విడుదల చేసింది. ఒమన్ నౌకాదళం ఆ కార్గోషిప్లోని 20 మంది నావికుల్ని రక్షించిందని పేర్కొంది. ‘‘ఈ దాడికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని తెలిపింది. ముగ్గురు గల్లంతయ్యారని, వారి ఆచూకీ గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.
పర్షియన్ గల్ఫ్లో మూడు వాణిజ్య నౌకలపై నిన్న దాడి జరిగినట్లు యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ వెల్లడించింది. అందులో మయూరీ నారీ ఉందోలేదో మాత్రం తెలియరాలేదు. పర్షియన్ గల్ఫ్లో 28 భారతీయ నౌకల్లో 778 మంది నావికులు చిక్కుకుపోయారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటిలో 24 నౌకలు హర్మూజ్ జలసంధికి పశ్చిమ భాగంలో.. నాలుగు నౌకలు తూర్పు వైపు ఉన్నాయని పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా వెల్లడించారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, సంబంధిత విభాగాలతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు.











