ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి. దేశవ్యాప్తంగా అయన జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. భారతీయ సంఘ సంస్కర్త, విద్య, మహిళా సాధికారత, కుల నిర్మూలన కోసం పోరాడిన గొప్ప దార్శనికుడు. ఆయన సేవలను జాతీయ స్థాయిలో స్మరించుకుంటారు. దేశంలో, ముఖ్యంగా అణగారిన వర్గాల మహిళలకు విద్యావకాశాలు కల్పించడంలో పూలే దంపతుల కృషి చిరస్మరణీయమైనది.
మహారాష్ట్రకు చెందిన ఈయన ఏప్రిల్ 11, 1827న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. సమాజంలో అందరికీ సమాన హక్కులు దక్కే వరకూ నిజమైన స్వాతంత్య్రం సిద్ధించదు అని మహాత్మా ఫులే దృఢంగా విశ్వసించారు. ఈ ఆలోచనను ఆచరణలోకి తేగల వ్యవస్థలను నిర్మించి సామాజిక న్యాయానికి దోహదపడ్డారు. భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి 1848లో పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించారు. 1873లో ‘సత్యశోధక్ సమాజ్‘ ఏర్పాటు చేసి, కుల వివక్షకు వ్యతిరేకంగా, సమ సమాజం కోసం నిరంతరం శ్రమించారు.
అయన సతీమణి సావిత్రీబాయి ఫులే ప్రస్తావన లేకుండా మహాత్మా జ్యోతిరావు ఫులే సంస్మరణ సంపూర్ణం కాదు. మహిళా ఉపాధ్యాయుల్లో మొదటివారిగా ఆమె బాలికా విద్యను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారు. మహాత్మా ఫులే మరణాంతరం ఆయన ఆశయాలను సావిత్రీబాయి ముందుకు తీసుకెళ్లారు. 1897లో దేశంలో ప్లేగు మహమ్మారి తలెత్తినప్పుడు ఆమె వ్యాధిగ్రస్తులకు నిబద్ధతతో సేవలందించారు. ఆ క్రమంలో స్వయంగా ప్లేగు వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయారు.











