భావుపేట సమీపంలో ఆటోని ఢీ కొన్న ఆర్టీసి బస్సు
ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
అటుగా వస్తున్న మంత్రి ఎర్రబెల్లి…
తన కాన్వాయ్ అపి దగ్గరుండి పర్యవేక్షించారు.
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం భావుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆటో, ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే సమీపంలోని వైద్యశాలకు పంపించారు. సరిగ్గా ఇదే సమయంలో సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడి హన్మకొండకు వస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఘటనను చూసి చలించి పోయారు.
తన కాన్వాయ్ ని ఆపి, ఘటనా స్థలంలో పోలీసులతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. మృతుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. క్షత గాత్రులను వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అలాగే క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.
రోడ్లపై ప్రయాణాలు ప్రమాదకరంగా ఉండకుండా ప్రయాణీకులే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, వేగానికి కంటే ప్రాణాలే మిన్న అనే విషయాన్ని గుర్తు పెట్టుకుని వాహనాలు నడపాలన్నారు. ఎవరైనా చనిపోతే, వారిని నమ్మకున్న వారి పరిస్థితి ఏంటని ఆలోచించాలన్నారు.