ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విషయంలో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం నోటీసులు పంపింది. లిక్కర్ స్కామ్ కేసులో తొలిసారిగా ఈనెల 11న కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. రెండో విడత విచారణకు ఈనెల 16న (ఈరోజు) కవిత హాజరు కావాల్సి ఉంది.
కాని, ఆమె హాజరు కాలేదు. తనకు ఆరోగ్యం బాగా లేదని, అలాగే ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, ఈడీ కి లేఖ రాసింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత నిర్ణయం తీసుకుంటామని కవిత తరఫు ఆమె న్యాయవాది సోమా భరత్ ను ఈడీ కార్యాలయానికి పంపించింది. గతంలో విచారణ సందర్బంగా వారు అడిగిన డాక్యుమెంట్లను అధికారులకు అందజేసినట్లు భరత్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే కవితకు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మరోవైపు కవిత వేసిన పిటిషన్ పై ఈనెల 24న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. కానీ దాని కంటే ముందే 20న హాజరుకావాలని ఈడీ స్పష్టం చేసింది. ఈరోజు ఈడీ ఆఫీసుకు వచ్చేందుకు నిరాకరించిన కవిత.. 20న మాత్రం విచారణకు హాజరువుతారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ 20న కవిత హాజరుకాకపోతే ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.